: రైలు ప్రయాణాల్లో రాయితీ కావాలనుకుంటే ఆధార్ తప్పనిసరి
అక్రమాలను అరికట్టడానికి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, సర్కారు అందించే సబ్సిడీలకు ఆధార్ నెంబరును అనుసంధానం చేయాలని చూస్తోన్న కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణాల్లో రాయితీ కావాలనుకునే వృద్ధులు కూడా తప్పనిసరిగా ఆధార్ నెంబర్ను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది ఎప్రిల్ నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇందు కోసం పలు మార్గదర్శకాలను ప్రకటించింది. వృద్ధులు రైల్వే కౌంటర్లు, ఈ-టికెట్ బుకింగ్ సమయంలో తమ ఆధార్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఆధార్ అనుసంధానంతో టికెట్ సిస్టమ్ అమలు చేయడంలో భాగంగా మొదట వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు రైలు టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ వివరాలను నమోదు చేసుకుంటారు. ఇక ఎప్రిల్ 1 నుంచి వృద్ధులు ఆధార్ వివరాలను రైల్వేకౌంటర్లు, బుకింగ్ సమయంలో సమర్పిస్తేనే రాయితీ లభిస్తుంది. ఇందుకోసం ఈ నెల 1 నుంచి ఆధార్ నెంబర్ ద్వారా వృద్ధుల వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్లలో వారు తమ ఆధార్ వివరాలను సమర్పించుకుంటున్నారు. వెరిఫికేషన్ అనంతరం జనవరి 1 నుంచి రైలు టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ వివరాలను నమోదు చేసుకోవచ్చు.