: బంగారం గురించి కంగారు వద్దు... నోట్ల రద్దు తర్వాత కొన్న బంగారానికే లెక్కలు చూపించాలి: వెంకయ్య నాయుడు

ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న బంగారానికి లెక్కలు చూపించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో... దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగింది. ఇక, మహిళల బాధ అయితే వర్ణణాతీతం. తమకు బంగారంపై ప్రేమ ఎక్కువగా ఉంటుందని... అయినా తరతరాలుగా వారసత్వంగా వస్తున్న బంగారానికి కూడా లెక్కలు చూపాలంటే ఎలాగని వారు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. బంగారంపై వస్తున్న వదంతులను నమ్మరాదని... తమ వద్ద ఉన్న బంగారం గురించి మహిళలు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. గతంలో కొన్న బంగారానికి, వారసత్వంగా వచ్చిన బంగారానికి లెక్కలు చూపాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అయితే, పెద్ద నోట్లు రద్దైన తర్వాత కొన్న బంగారానికి మాత్రం కచ్చితంగా లెక్కలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. దేశం బాగుపడాలనే ఆకాంక్షతో చేపట్టిన కార్యక్రమాలకు కొన్ని కష్టాలు తప్పవని చెప్పారు. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వెంకయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. సైన్యం గురించి మమత అనవసర రాద్ధాంతం చేస్తున్నారని... సైన్యం తన విధులను తాను నిర్వహిస్తోందని చెప్పారు.

More Telugu News