: ఇక నాలుగంచెల ఉద్యమం.. ఈ నెల 18 నుంచి ప్రారంభం!: ముద్రగడ

కాపు రిజర్వేషన్ సాధనలో నాలుగంచెల ఉద్యమాన్ని చేపడతామని కాపు రిజర్వేషన్ సాధన సమితి నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల కాపు జాయింట్ యాక్షన్ కమిటీ నేతలతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాపు ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని అన్నారు. అందులో భాగంగా నాలుగంచెల ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈ నాలుగంచెల ఉద్యమంలో ఈనెల 18న నల్ల రిబ్బన్లు, కంచం, గరిటతో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. తరువాత ఈ నెల 30న ప్రజాప్రతినిధులందర్నీ కలిసి వినతిపత్రాలు ఇస్తామని ఆయన చెప్పారు. మూడో దశలో జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామని ఆయన ప్రకటించారు. ఇక చివరగా నాలుగో దశలో 2017 జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి కాపులు హాజరవుతారని, దీనికి పోలీసుల అనుమతి తీసుకునే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News