: భార్య గొంతు కోసి హత్య చేసిన టెక్కీ

విచక్షణ మరిచిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కట్టుకున్న భార్యనే దారుణంగా హత్య చేశాడు. అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాదులోని దుమ్మాయిగూడ అయ్యప్ప కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, దుమ్మాయిగూడకు చెందిన చక్రపాణికి, సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన మాధవి (34)తో 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చక్రపాణి హైటెక్ సిటీలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. పెళ్లయిన ఏడాది పాటు వీరిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత చక్రపాణి మద్యానికి బానిపై, ప్రతిరోజూ భార్యను వేధించడం ప్రారంభించాడు. పలుమార్లు భార్యను చాలా దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో, ఆమె అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. వారం క్రితం మాధవిని తీవ్రంగా కొట్టి, పిల్లలతో సహా ఆమెను పుట్టింట్లో వదిలివెళ్లాడు చక్రపాణి. నిన్న సాయంత్రం అత్తగారింటికి వచ్చి దుమ్మాయిగూడలోని తమ ఇంటికి భార్యను తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమెను కత్తితో 15 సార్లు పొడిచి, పరారయ్యాడు. తమ ఇంటికి వచ్చే సమయానికే చక్రపాణి మద్యం మత్తులో ఉండటంతో... అనుమానంతో దుమ్మయిగూడలోని ఇంటికి మాధవి తల్లిదండ్రులు వచ్చారు. ఇంట్లోకి వచ్చి చూసేపరికే ఆమె రక్తపుమడుగులో పడి ఉంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని చక్రపాణి కోసం గాలిస్తున్నారు.

More Telugu News