: రైలు టాయిలెట్లో లక్షల రూపాయల పాత నోట్లు

పాత పెద్ద నోట్లు దగ్గర ఉంచుకున్న వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. కొందరేమో వాటిని మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మరికొందరేమో వాటిని మార్చుకోవడం కుదరక, వాటిని వదిలించుకోవడానికి పాట్లు పడుతున్నారు. నోట్లను కాల్చి వేయడం, చింపి వేయడం, డ్రైనేజీల్లో పడేయటం వంటి పనులు చేస్తున్నారు. తాజాగా, ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లోని టాయెలెట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ. 4.5 లక్షలను వదిలేశారు. రైల్వే పోలీసులు ఈ నోట్లను గుర్తించారు. ఇవన్నీ కూడా రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లే. ఈ డబ్బును ఆదాయ పన్ను అధికారులకు అప్పగించినట్టు రైల్వే ఎస్పీ సంజయ్ తెలిపారు. ఇదే సమయంలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఘటన వివరాల్లోకి వెళ్తే, ముగ్గురు వ్యక్తులు టాయిలెట్లోకి వెళ్లి, కొన్ని నిమిషాల పాటు లాక్ చేసుకున్నారని... తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు వచ్చి టాయిలెట్ డోర్ తెరిచారు. దీంతో ముగ్గురు వ్యక్తులు అందులో నుంచి బయటకు వచ్చారు. టాయిలెట్ ను చెక్ చేయగా, అందులో పాత కరెన్సీ బయటపడింది. దీంతో, వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More Telugu News