: ‘అమ్మో ఒకటో తారీఖు’ అన్న దిగులు వద్దు.. రెడీగా 210 టన్నుల కొత్త నోట్లు: ఆర్బీఐ, ఎస్బీఐ భరోసా
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మూడు వారాలు దాటినా బ్యాంకులు, ఏటీఎంలలో తగినంత డబ్బు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. నెలఖారు కావడంతో సామాన్యుల ఇళ్లలో సరుకులు అన్నీ అయిపోయాయి. రేపు జీతాలు పడే రోజు అయినప్పటికీ బ్యాంకుల్లో నగదు కొరత ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మరిన్ని చర్యలు తీసుకుంటోంది. రేపు ఒకటో తారీఖన్న ఆందోళన వద్దని సూచిస్తోంది. నిన్నటి వరకు విమానాల ద్వారా 210 టన్నుల కరెన్సీ నోట్లను బట్వాడా చేశామని ఆర్బీఐ తెలిపింది. సీ-130, సీ-170, ఏఎన్-32 వంటి యుద్ధ విమానాలలో కొత్త నోట్లను వివిధ ఆర్బీఐ కేంద్రాలకు ఇప్పటికే తరలించామని పేర్కొంది. ఎస్బీఐ కూడా ఈ అంశంపై స్పందించింది. రేపు ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తామని చెప్పింది. దేశంలో ఎస్బీఐ ఏటీఎంలు 90 శాతం వరకు పనిచేస్తూనే ఉన్నాయని, తమ బ్యాంకు ద్వారా రోజుకు రూ. 6 వేల కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపింది. 500 రూపాయల నోటు కూడా అందుబాటులోకి వస్తుండడంతో ఇబ్బందులు ఉండబోవని పేర్కొంది.