: నోట్ల రద్దు విషయంలో భారత ప్రధానిని నవాజ్ షరీఫ్ అనుసరించాలి: ‘పాక్’లో అత్యంత సంపన్నుడు మాలిక్ రియాజ్

భారత్ లో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ లో అత్యంత సంపన్నుడు, మోదీ అభిమాని అయిన మాలిక్ రియాజ్ ప్రశంసలు కురిపించారు. ఈ విషయంలో పాకిస్థాన్ కూడా భారత్ అడుగుజాడల్లో నడవాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఆయన సూచిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో భారత్ ప్రభుత్వం ఇప్పటివరకు 228 బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలిసిందని, ఈ విషయంలో భారత ప్రధాని మోదీని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అనుసరించి ఉంటే కనుక పాకిస్థాన్ లో 10 నుంచి 15 బిలియన్ డాల్లర్లు వసూలు అయి ఉండేదని అభిప్రాయపడ్డారు. జియో టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు అనేది ఓ బిలియన్ డాలర్ ఐడియా అని, ఈ ఐడియాను కనుక పాక్ లో అమలు చేస్తే ఇక్కడి నల్లధనం అంతా ఊడ్చుకుపోతుందని అన్నారు. తమ దేశంలో నల్లధనం కారణంగా పాక్ ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటోందని అన్నారు. యాభై లేదా అరవై రోజుల ముందుగా అధికారిక ప్రకటన చేసి పాకిస్థాన్ లోని రూ.500, రూ.1000, రూ.5000 నోట్లను రద్దు చేయాలని, విదేశాల్లోని పాకిస్థాన్ పౌరులకు కూడా దీనిని వర్తింపజేయాలని మాలిక్ రియాజ్ అభిప్రాయపడ్డారు.

More Telugu News