: కిడ్నీలు పాడైపోయిన మహిళకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ తన పెద్ద మనసును చాటుకున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి, సహాయం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళకు సాయం చేసేందుకు ఆయన ముందుకొచ్చారు. "ఆమె వివరాలు పంపండి... ఆమెకు తప్పకుండా సహాయం చేస్తా" అంటూ ఆయన ట్విట్టర్లో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ లోని ఉప్పల్ లో 55 ఏళ్ల కరుణ ఓ అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తున్నారు. 'కారుణ్య ఆర్ఫా అండ్ ఓల్డేజ్ హోమ్' పేరిట ఆమె నిర్వహిస్తున్న ఆశ్రమంలో 70 మంది అనాథ చిన్నారులు, నలుగురు వితంతువులు ఆశ్రయం పొందుతున్నారు. ఇటీవల కరుణ రెండు కిడ్నీలు చెడిపోవడంతో నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆమెకు నిమ్స్ లో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని.. వైద్య ఖర్చులకు రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని... 'హృదయ స్పందన' అనే స్వచ్ఛంద సంస్థ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించి... తప్పకుండా సాయం చేస్తామని తెలిపారు.

More Telugu News