: ఈ పెళ్లి ముందు 'గాలి' వారి పెళ్లి బలాదూర్... కళ్లు చెదిరే రీతిలో ఏర్పాట్లు

మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహం బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారు. జనాలంతా నోట్ల కొరతతో ఇబ్బందులు పడుతుంటే... పెళ్లి కోసం వందల కోట్లు ఖర్చు చేయడమేంటని చాలా మంది ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ బీజేపీపై మండిపడ్డాయి. గాలికి బీజేపీ కొమ్ముకాస్తోందని ఆరోపించాయి. అయితే, ఈ పెళ్లిని తలదన్నేలా కర్ణాటకలో మరో పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లితో కాంగ్రెస్ పార్టీ నేతల నోళ్లు మూతపడబోతున్నాయి. ఎందుకంటే, ఇది కాంగ్రెస్ నేత, రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల మంత్రి రమేష్ జర్కిహొలి కుమారుడి పెళ్లి కాబట్టి. ఈ పెళ్లి కోసం చేేస్తున్న ఏర్పాట్లు వింటే 'ఔరా' అనిపిస్తుంది. గోకక్ పట్టణంలో ఆదివారం నాడు ఈ పెళ్లి జరగబోతోంది. ఇక ఆ విశేషాలు చూస్తే, కేవలం కల్యాణ్ మంటపాన్నే రెండు ఎకరాల్లో నిర్మిస్తున్నారు. పెళ్లి మండపం అంతా ఎయిర్ కండిషన్డే. కొల్హాపూర్ లోని మహాలక్ష్మి ఆలయం మాదిరి పెళ్లి మంటపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ శివార్లలో వీవీఐపీల హెలికాప్టర్ల కోసం హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. ఈ పెళ్లికి కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరవుతారని సమాచారం. భారీ సంఖ్యలో ప్రముఖులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. లక్షమందికి పైగా పెళ్లికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పట్టణమంతా పెళ్లికి సంబంధించిన ఆహ్వాన బ్యానర్లు, కటౌట్లతో నిండిపోయింది.

More Telugu News