: హైదరాబాద్ టిఫిన్ సెంటర్లో ప్రత్యక్షమైన కొత్త రూ. 500 నోటు... సంబరపడ్డ యజమాని!

'మీ దగ్గర రూ. 100 నోట్లు ఉన్నాయా?' కూరగాయలు కొనేందుకు రైతు బజార్ కు వెళ్లినా, ఇంట్లో అత్యవసరంగా కావాల్సిన సరుకులు తెచ్చేందుకు కిరాణా దుకాణానికి వెళ్లినా, హోటలుకు వెళ్లినా గత రెండు వారాల నుంచి వినిపించే తొలి ప్రశ్న ఇదే. మార్కెట్లో ఉన్న రూ. 2 వేలకు చిల్లర ఇచ్చుకోలేక, చలామణిలో ఉన్న రూ. 100ల నోట్ల కొరతతో అవస్థలు పడుతున్న ఓ హోటల్ యజమాని సంబరపడ్డ ఘటన ఇది. హైదరాబాద్ లో బ్యాంకులకే ఇంకా కొత్త 500 రూపాయల నోట్లు పూర్తిగా రాలేదు. ఓ హోటల్ యజమాని చేతికి ఇది వచ్చింది. మారేడుపల్లిలోని ఓ వ్యక్తి, తన సోదరుడు ఢిల్లీ నుంచి తెచ్చిన నోటుతో హోటల్ కు వచ్చి టిఫిన్ చేశాడు. ఆపై కొత్త రూ. 500 నోటును కౌంటర్ లో ఇస్తే, అక్కడున్న అందరికీ ఆశ్చర్యం కలిగింది. చాలా రోజుల తరువాత 500 రూపాయలను చూస్తున్నానని హోటల్ యజమాని సంబరంగా చెప్పాడు. ఈ నోట్లు విరివిగా మార్కెట్లో అందుబాటులోకి వస్తే, చిల్లర కష్టాలు దాదాపు తీరినట్టేనని పలువురు వ్యాఖ్యానించారు.

More Telugu News