: అసభ్యకర ఫొటోలు పంపుతున్నాడంటూ ఫిర్యాదు.. 'దూకుడు' నటుడు ఎజాజ్ ఖాన్ అరెస్ట్.. బెయిల్‌ పై విడుదల

అసభ్యకర ఫొటోలు పంపుతున్నాడంటూ ఓ మహిళ బాలీవుడ్ నటుడు ఎజాజ్‌ ఖాన్‌పై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌డంతో అత‌డిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఆయ‌నను పోలీసులు న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌ర‌చ‌గా కోర్టు బెయిల్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం స‌ద‌రు న‌టుడి నుంచి మల్వానీకి చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్ రావ‌డంతో ఆమె ఆయ‌న‌కు ఫ్రెండ్ అయింది. ఆ మ‌హిళ‌తో ఎజాజ్ ఖాన్ ప్ర‌తిరోజు చాటింగ్ చేస్తున్నాడు. బొటీక్‌ నిర్వహిస్తున్న ఆ మ‌హిళ‌కు డబ్బు అవసరం రావ‌డంతో ఫేస్‌బుక్ ద్వారా ప‌రియ‌మైన ఎజాజ్‌ను డబ్బు కావాల‌ని కోరింది. ఆ మ‌హిళ‌కు ఎజాజ్ డ‌బ్బు ఇస్తాన‌ని, త‌న‌ను క‌ల‌వ‌డానికి రమ్మ‌ని చెప్పాడు. అయితే, ఎజాజ్‌ని కలవడానికి ఆ మ‌హిళ వ‌చ్చిన‌ప్పుడు ఎజాజ్ షూటింగ్‌లో ఉండ‌డంతో ఆమె క‌ల‌వ‌డానికి వీలు లేకుండా పోయింది. అనంత‌రం ఎజాజ్ ఆ మ‌హిళ‌కు ఫోను చేసి ఆమె వ‌చ్చిన‌ప్పుడు బిజీగా ఉన్నానని, మ‌ళ్లీ క‌ల‌వ‌డానికి రమ్మ‌ని చెప్పాడు. అయితే, ఆ మ‌హిళ మ‌ళ్లీ రావ‌డానికి ఒప్పుకోలేదు. అనంత‌రం ఎజాజ్‌ వాట్సప్‌లో పెట్టుకున్న‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ బాగుందని స‌ద‌రు మ‌హిళ ఆయ‌న‌కు మెసేజ్‌ పెట్టింది. అయితే, స‌ద‌రు మ‌హిళ‌కు సారీ చెబుతూ ప‌లుసార్లు అస‌భ్య‌క‌ర‌ ఫొటోలు పంపాడు. దీంతో స‌దరు మ‌హిళ ఇటీవ‌ల చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఈ విష‌యంపై ఎజాజ్ మీడియాతో మాట్లాడుతూ... తానెవరికీ మెసేజ్‌లు, ఫొటోలు పంపలేదని వ్యాఖ్యానించాడు. తాను ఓ సెలబ్రిటీ అయినందుకే తనపై ఆరోప‌ణ‌లు చేస్తూ వేధించాలని చూస్తున్నారని అన్నాడు. నటుడు ఎజాజ్‌ ఖాన్‌ తెలుగులో 'దూకుడు' సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

More Telugu News