: పాత నోట్ల‌ను ఇత‌రుల ఖాతాల్లో జ‌మ చేసేవారికి హెచ్చ‌రిక‌.. ఏడేళ్ల జైలు శిక్ష త‌ప్ప‌ద‌న్న ఐటీశాఖ‌

పాత నోట్ల‌ను ఇత‌రుల ఖాతాల్లో జ‌మ చేస్తున్న వారిపై కొర‌డా ఝ‌ళిపించేందుకు ఐటీశాఖ సిద్ధ‌మైంది. ఇక‌నుంచి ఇత‌రుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ‌చేసే వారికి ఏడేళ్ల జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. ఐటీశాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక్కో ఖాతాలో రూ.2.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ న‌గ‌దు ఉంటే ఆ వివరాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న ఖాతాల్లో రూ.50 వేల వ‌ర‌కు జ‌మ‌చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఆ నోట్లను మార్చుకునేందుకు న‌కిలీ బాబులు జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ను ఉప‌యోగించుకుంటున్నట్టు వ‌స్తున్న వార్తల నేప‌థ్యంలో ఐటీ శాఖ ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈనెల 8వ తేదీ త‌ర్వాత బ్యాంకు ఖాతాల్లో అయిన న‌గ‌దు జ‌మ వివ‌రాల‌ను ఐటీ శాఖ రాబ‌డుతోంది. కొన్ని ఖాతాల్లో అసాధార‌ణ‌, అనుమానాస్ప‌ద రీతిలో పెద్ద‌మొత్తంలో న‌గ‌దు జ‌మ అవుతున్న‌ట్టు గుర్తించింది. ఈ విష‌య‌మై ఫిర్యాదులు అందుకున్న ఐటీశాఖ అక్ర‌మార్కుల ప‌నిప‌ట్టేందుకు సిద్ధ‌మైంది. ఇత‌రుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేసే వారికి ఏడేళ్ల జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. తాజా హెచ్చ‌రిక‌లతో న‌ల్ల‌కుబేరుల గుండెల్లో వ‌ణుకు మొద‌లైంది. ఉన్న నోట్ల‌ను మార్చుకోవ‌డ‌మెలాగో తెలియ‌క అల్లాడిపోతున్నారు.

More Telugu News