: పాడేరులో ఆగ్రహంతో ఏటీఎం మెషీన్లు ధ్వంసం చేసిన వినియోగదారుడు

నోట్ల రద్దు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్కసారిగా 500, 1000 రూపాయల నోట్లు చెల్లకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వీటిని మార్చుకోవడానికి బ్యాంకుల ముందు క్యూకడితే కేవలం 2000 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం జిల్లా పాడేరు మండల కేంద్రంలోని ఏటీఎంకు వచ్చిన ఓ వినియోగదారుడు తన డెబిట్ కార్డు ఏటీఎంలో పెట్టి డబ్బులు తీసే ప్రయత్నం చేశాడు. డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు వ్యక్తి, పట్టరాని కోపంతో ఏటీఎంను కసితీరా పలుసార్లు తన్నాడు. దీంతో అది పాడైపోయింది. అంతటితో శాంతించని ఆ వినియోగదారుడు పక్కనే ఉన్న మరో ఏటీఎంను కూడా అలాగే ధ్వంసం చేశాడు. ఆ తర్వాత విషయం తెలుసుకుని వచ్చిన బ్యాంకు అధికారులు అక్కడి సీసీ టీవీ పుటేజ్ పరిశీలించి, వినియోగదారుడు ఆగ్రహంతో చేసిన పనిని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

More Telugu News