: గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లిపై బీజేపీ నేతలకు అమిత్ షా ఆదేశాలు!

రేపు జరగనున్న గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహానికి బీజేపీ నేతలెవరూ వెళ్లరాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేసిన తరుణంలో, అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి వెళితే, వివాదాలు, విమర్శలు చుట్టుముట్టవచ్చని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అమిత్ షా, స్వయంగా యడ్యూరప్పకు ఫోన్ చేసి చెప్పారని, ఇప్పటికే ఈ పెళ్లికి వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు వెనక్కు తగ్గవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పెళ్లికి నేతలు హాజరైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అమిత్ షా చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, బ్రాహ్మణి వివాహ వేడుకలు, బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

More Telugu News