: మోదీ జీ... 50 రోజుల టైమిస్తే ఒక్కో ఖాతాలో రూ. 15 లక్షలు వేసేస్తారా ఏంటి?: లాలూ ప్రసాద్ యాదవ్ ఎద్దేవా

ప్రధాని నరేంద్ర మోదీ పాత నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తరువాత ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తొలిసారిగా స్పందించారు. గోవా వేదికగా, తనకు 50 రోజుల సమయం ఇవ్వాలని మోదీ కోరిన నేపథ్యంలో, లాలూ మీడియాతో మాట్లాడుతూ, "మోదీ జీ... 50 రోజుల సమయం పూర్తయిన తరువాత మీరు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తారా? మీ హామీని నెరవేర్చుకుంటామని చెప్పగలిగితే, ఈ అసౌకర్యాన్ని భరించేందుకు ప్రజలు సిద్ధమే" అని ఆయన ట్వీట్ చేశారు. మోదీ చర్యను అలక్షిత దాడి (ఫెర్జికల్ స్ట్రయిక్), తప్పుడు ఎన్ కౌంటర్ లతో పోల్చిన లాలూ, ప్రజలు తమ ఖాతాల్లో రూ. 15 లక్షలు పడకుంటే ఊరుకోబోరని, ఆ ప్రభావాన్ని మోదీ అనుభవిస్తారని అన్నారు. తాను నల్లధనాన్ని వ్యతిరేకిస్తానని, అయితే, ఓ దక్పథం లేకుండా, సరైన ప్రణాళిక లేకుండా తీసుకునే ఈ తరహా నిర్ణయాలు దేశ ప్రగతికి విఘాతాలవుతాయని లాలూ అభిప్రాయపడ్డారు.

More Telugu News