: నోట్ల రద్దు ఎఫెక్ట్: పూణెలో గత ఐదు రోజులుగా ఒక్క దొంగతనం కూడా నమోదు కాలేదట!

పెద్ద నోట్ల రద్దుతో పూణెలో దొంగతనాలకు బ్రేక్ పడింది. గత ఐదు రోజులుగా ఒక్కటంటే ఒక్క చోరీ కూడా జరగలేదని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా నగరంలోని 39 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు ఐదారు చోరీ కేసులు నమోదయ్యేవి. అయితే గత ఐదు రోజులుగా పూణె, చించ్వాద్ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క చోరీ కూడా కేసు నమోదు కాలేదు. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబరు 7న నమోదైన చోరీ కేసే ఆఖరిదని పోలీసులు తెలిపారు. బాధితుడు సంజయ్ జాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనాలు ఆగాయని రాత్రివేళ పెట్రోలింగ్ ఆపడం లేదని, అప్రమత్తంగానే ఉంటున్నామని పోలీసులు తెలిపారు. ఉన్న డబ్బులు పట్టుకుని ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతుండడం, పెద్ద నోట్లు రద్దు కావడంతో చోరీ చేసినా ఫలితం ఉండదనే అభిప్రాయంతో ఉన్న దొంగలు తాత్కాలికంగా దొంగతనాలకు బ్రేక్ వేసినట్టు చెబుతున్నారు.

More Telugu News