: మా అక్కను వేధించారు... వాళ్లను చంపేద్దామనుకున్నా: పవన్ కల్యాణ్

అనంతపురం జిల్లా గుత్తిలో విద్యార్థులతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్... విద్యార్థినుల రక్షణ, భద్రత గురించి మాట్లాడుతూ, తన చిన్నప్పుడు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. "నా చిన్నతనంలో మా అక్కను కొందరు ఏడిపించారు. అప్పుడు నాకు వాళ్లను చంపేద్దామనిపించింది. అంత కోపం వచ్చింది. ఆడవాళ్లు బయటకు వెళితే, ఇలాంటి వేధింపులు తప్పవా? ఈ పరిస్థితి మారాలన్న ఆలోచన అప్పటి నుంచే నా మనసులో ఉండిపోయింది" అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే, విద్యార్థినుల ఆత్మగౌరవాన్ని అవమానించిన వారెవరైనా, వారిని కొట్టినా, తిట్టినా కేసులు ఉండకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అమ్మాయిలు ఇంట్లో అయినా, వీధిలో అయినా ఒంటరిగా ఉండేందుకు, నడిచి వెళ్లేందుకు వీలు కల్పించే, భద్రత అందించే సమాజం రావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఓ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే, అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. అధికారం లేకపోయినా సమస్యలను పరిష్కరించవచ్చని చెప్పుకొచ్చారు.

More Telugu News