: విమానంలో బాంబుందని బెదిరించిన భారతీయుడికి 34 లక్షల జరిమానా

స్విట్జర్లాండ్‌ లోని మాంట్రిక్స్‌ లో సరైన సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేక, విమానాన్ని ఆపేందుకు ప్లాన్ వేసి, ఆ విమానంలో బాంబు ఉందని హెచ్చరించిన భారతీయుడికి జరిమానాతో పాటు, కఠిన శిక్ష విధించారు. ఈ మేరకు జెనీవా పోలీస్ చీఫ్ ఫ్రాంకోయీస్ వారిడెల్ మాట్లాడుతూ, గత నెలలో జెనీవాలోని విమానాశ్రయం నుంచి బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో బాంబు ఉందంటూ భారతీయుడు ఫోన్ చేశాడు. దీంతో హుటాహుటీన స్పందించిన భద్రతా సిబ్బంది విమానాన్ని చుట్టుముట్టి, ప్రయాణికులను దించేసి, తనిఖీలు నిర్వహించారు. ఇందుకోసం 101 మంది పోలీసు అధికారులు, ఆరుగురు పబ్లిక్ సెక్యూరిటీ ఏజెంట్లు శ్రమించారని ఆయన చెప్పారు. ఆయన చేసిన ఫోన్ కాల్ కారణంగా 116 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని ఆయన చెప్పారు. అతనిని గుర్తించి, విచారించగా, నిందితుడు భారతదేశం వెళ్ళేందుకు సకాలంలో జెనీవా విమానాశ్రయానికి చేరుకోలేకపోవడంతో, ప్రయాణానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని ఆపాలన్న ఉద్దేశంతో ఈ ఉత్తుత్తి బాంబు హెచ్చరిక చేశాడని ఆయన తెలిపారు. దీంతో అతనికి 34 లక్షల రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించినట్టు చెప్పారు.

More Telugu News