: పిల్లలను తీవ్రవాదులుగా చేయాలన్న లక్ష్యంతోనే పాఠశాలలకు నిప్పు: అనుపమ్ ఖేర్ మండిపాటు

కశ్మీర్ లో గత రెండు నెలల్లో పాతికకు పైగా పాఠశాలలు అగ్నికీలలకు ఆహుతి కావడం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముంబైలో ఆయన మాట్లాడుతూ, కశ్మీరులో చోటుచేసుకుంటున్న అల్లర్ల కారణంగా జులై 9 నుంచి పాఠశాలలన్నీ మూతబడిపోయాయని మండిపడ్డారు. చదువుకునే అవకాశం లేక పిల్లలు ఉగ్రవాదులుగా మారాలనే ఉద్దేశంతోనే దుండగులు పాఠశాలలకు నిప్పుపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పాఠశాలలు తగులబెట్టే దుండగులంతా విద్యార్థుల అభివృద్ధి నిరోధకులని అన్నారు. కశ్మీరీ పిల్లలు విద్యావంతులు కావడం, అభివృద్ధి సాధించడం వారికి ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. ఇలా కశ్మీరీలు నిరక్షరాస్యులుగా మిగిలిపోతే తీవ్రవాదంతో వారి మనసులను కలుషితం చేయవచ్చన్నది దుండగుల పన్నాగమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తయారు కాకుండా, పెడతోవ పట్టాలనేది వారి ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News