: మోసుల్ కింద రహస్యంగా మరో నగరం... డెడ్లీ డేంజర్ అంటున్న సైన్యం!

ఇరాక్ లోని మోసుల్ నగరం. 2014 నుంచి ఐఎస్ఐఎస్ కబందహస్తాల్లో చిక్కి, ఇప్పుడిప్పుడే సైన్యం వశమవుతున్న నగరం. ఒకప్పుడు మంచి రహదార్లు, ఎత్తయిన భవనాలు, వందల కోట్లలో వ్యాపారం జరిగే మోసుల్ నగరం, ఇప్పుడు శిథిలమైపోయి గత చరిత్రకు ఆనవాలుగా కనిపిస్తోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన ఘాతుకాలకు వేలాది మంది నగర ప్రజలు వలస వెళ్లిపోయాయి. ఇక ఉగ్రవాదుల ఆచూకీ కోసం, వారు ఉన్నారన్న అనుమానంతో భద్రతాదళాలు ఎన్నో భవనాలను నేలమట్టం చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ రక్షణ కోసం నగరం కింద మరో నగరాన్నే నిర్మించుకోవడం భద్రతాదళాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పెద్ద పెద్ద బంకర్లలో భారీ ఎత్తున మందు పాతరలు ఉండటం, బంకర్లు ఎక్కడ ఉన్నాయన్న విషయమై సరైన సమాచారం లేకపోవడంతో మరిన్ని రోజుల పాటు మోసుల్ 'డెడ్లీ డేంజర్' అంటున్నారు నిపుణులు మోసుల్ నగరాన్ని వశం చేసుకున్న తరువాత ఇప్పటివరకూ ఆరు భారీ టన్నెల్స్ కనిపించాయి. గత మూడు రోజులుగా టన్నెల్స్ ను గుర్తించడమే సైన్యానికి ప్రధాన కర్తవ్యమైంది. గుర్తించిన టన్నెల్స్ లో సకల సౌకర్యాలూ ఉన్నట్టు తెలుస్తోంది. గత వారాంతంలో సైన్యానికి, టన్నెల్స్ లో దాగుండి విరుచుకుపడ్డ ఉగ్రవాదులకూ మధ్య తీవ్ర యుద్ధం జరిగిందని బ్రిగేడియర్ జనరల్ యహ్యా రసూల్ వెల్లడించారు. గత రెండేళ్లుగా తమ గుప్పిట్లోని మోసుల్ నగరంలో ఐఎస్ఐఎస్ ఎన్నో టన్నెల్స్ ను నిర్మించుకుందని వివరించారు. ప్రస్తుతం ఇరాక్ ప్రత్యేక దళాలు మోసుల్ తూర్పు ప్రాంతాన్ని వశం చేసుకున్నాయని, కమాండర్లు నగరం నడిబొడ్డుకు చేరుకుంటున్నారని తెలిపారు. తమ సైన్యం కంటబడ్డ ఉగ్రవాదులు కొందరు ఉన్నట్టుండి మాయం అయ్యారని, వీరు బంకర్లలోకి, భవనాల కింద నిర్మించుకున్న టన్నెల్స్ లోకి వెళ్లి ఉంటారని వెల్లడించారు. ఇక వీటిని వెతికితీసి, మోసుల్ నగరాన్ని ఉగ్రవాదుల రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News