: బెంగళూరు ఐటీ కంపెనీ సనోవీ టెక్నాలజీస్ పై కన్నేసిన ఐబీఎం!

బెంగళూరు కేంద్రంగా క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధిత సాఫ్ట్ వేర్ సేవలందిస్తున్న సనోవీ టెక్నాలజీస్ పై యూఎస్ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఐబీఎం కన్ను పడింది. సనోవీని విలీనం చేసుకునేందుకు ఒప్పందంపై సంతకాలు చేశామని ఐబీఎం ఓ ప్రకటనలో తెలిపింది. "క్లౌడ్ విభాగంలో పనిచేస్తున్న సనోవీ చేరికతో అప్లికేషన్స్, డేటా, ఐటీ సిస్టమ్స్ తదితర విభాగాల్లో మా బలం మరింతగా పెరుగుతుందని విశ్వసిస్తున్నాం. డిజిటల్, హైబ్రీడ్ క్లౌడ్ విభాగాల మధ్య మరింత సమన్వయం దిశగా సనోవీ మాకెంతో సహకరించనుంది" అని ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ టెక్నాలజీ సేవల విభాగం) మార్టిన్ జెట్టల్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ డీల్ డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని సమాచారం. అయితే, సనోవీని దక్కించుకునేందుకు ఐబీఎం ఎంత మొత్తాన్ని వెచ్చిస్తున్నదన్న వివరాలు తెలియరాలేదు. 2003లో బెంగళూరులో చిన్న ఐటీ కంపెనీగా మొదలైన సనోవీ, ప్రస్తుతం అమెరికా, మద్య ప్రాచ్య, ఆసియా దేశాల్లో విస్తరించింది. ఐబీఎం ప్రపంచవ్యాప్తంగా 68 దేశాల్లో 300 గ్లోబల్ డెలివరీ డేటా సెంటర్లను, 46 క్లౌడ్ డేటా సెంటర్లనూ నిర్వహిస్తోంది.

More Telugu News