: విశాఖను కంగారెత్తిస్తున్న ‘కయాంత్’.. భయాందోళనల్లో ప్రజలు.. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు!

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ తుపానుకు అధికారులు కయాంత్ గా నామకరణం చేసిన సంగతి విదితమే. విశాఖకు ఆగ్నేయంగా 685 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన కయాంత్ వేగంగా తీరం వైపు దూసుకొస్తుండడంతో విశాఖ వాసులు భయంతో వణికిపోతున్నారు. రెండేళ్ల క్రితం సంభవించిన ‘హుద్‌హుద్’ను గుర్తుకు తెచ్చుకుని భయపడుతున్నారు. తుపాను ప్రభావంతో రేపటి నుంచి ఏపీలో, ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఓడరేవుల్లో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రెండేళ్ల క్రితం హుద్‌హుద్ తుపాను చేసిన గాయం ఇంకా మానకముందే మరోమారు కయాంత్ రూపంలో మరో తుపాను దూసుకువస్తోంది. హుద్‌హుద్ సమయంలో ప్రచండ వేగంతో వీచిన గాలులకు విశాఖ నగరం చిగురుటాకులా వణికిపోయింది. పెద్దపెద్ద వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఆనాటి గాయం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న విశాఖ వాసులకు కయాంత్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 29న ప్రకాశం జిల్లాలో కయాంట్ తీరం దాటే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ తుపానుపై మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్టణంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతోపాటు ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మరోవైపు ఈనెల 29న విశాఖలో జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌ను రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News