: హైదరాబాద్‌ నుంచి ప్రకటించిన నల్లధనంలో 10 వేల కోట్ల రూపాయ‌లు వైసీపీ అధినేత‌వే!: ఏపీ మంత్రి దేవినేని ఆరోపణ

ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వరరావు ఈరోజు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా వెల్లడించిన నల్లధనంలో జగన్‌దే అధిక భాగం ఉంద‌ని ఆరోపించారు. హైదరాబాద్‌ నుంచి ప్రకటించిన మొత్తం నల్లదనం సొమ్ములో 10 వేల కోట్ల రూపాయ‌లు వైసీపీ అధినేత‌వేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. జగన్‌ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నాడని, అందుకోసం చట్టాన్ని సైతం అడ్డం పెట్టుకుంటున్నాడ‌ని ఆయ‌న ఆరోపించారు. జ‌గ‌న్ అక్ర‌మంగా దాచుకున్న సొమ్ముతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని ఆయ‌న అన్నారు. జ‌గన్‌కు బినామీల పేరుతోనూ అనేక ఆస్తులు ఉన్నాయ‌ని దేవినేని ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో వేలాది ఎకరాల భూములు, గ‌నులు ఉన్నాయని అన్నారు. రూ.33,935 కోట్ల విలువైన 94,038 ఎకరాల భూములు జ‌గ‌న్‌కు బినామీ పేరుతో ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అంతేగాక‌, లక్షా 81వేల ఎకరాల మేర గనులు కూడా ఉన్నాయని వివ‌రాలు వెల్ల‌డించారు. కాపుల రిజ‌ర్వేష‌న్‌ల సాధన పోరాటంలో భాగంగా తునిలో నిర్వ‌హించిన సభ నేప‌థ్యంలో జ‌రిగిన‌ విధ్వంసం కేసులో వైసీపీ పాత్ర త్వరలోనే వెల్ల‌డ‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు. పులివెందుల ప్రాంతానికి నీళ్లు రావంటూ ఆయ‌న ప్రచారం చేస్తున్నారని దేవినేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ ప్ర‌చారాన్ని ప‌టాపంచ‌లు చేస్తూ పులివెందులకు నీళ్లిచ్చి అక్కడి ప్ర‌జ‌ల‌తో జేజేలు కొట్టించుకుంటామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

More Telugu News