: ‘అంతా అవినీతిమయం, ధ‌న దాహం’... ముఖ్యమంత్రి చంద్రబాబుపై బొత్స విమర్శలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ పరిపాల‌న అస్త‌వ్య‌స్తంగా త‌యారయింద‌ని వైఎస్సార్ సీపీ అధికార ప్ర‌తినిధి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు. ఈరోజు హైద‌రాబాద్‌లోని వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌భుత్వ నేత‌ల ధ‌నదాహం ఎంత‌కీ తీర‌డం లేదని వ్యాఖ్యానించారు. ప‌లు అంశాల్లో న్యాయ‌స్థానం హెచ్చ‌రిక‌లు చేసినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలే ఇసుక దందాలో ఉన్నారని ఆయ‌న ఆరోపించారు. టీడీపీ నేత‌లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను సింగ‌పూర్ కంపెనీల‌కు తాక‌ట్టు పెడుతున్నార‌ని బొత్స సత్య‌నారాయ‌ణ అన్నారు. ప్ర‌భుత్వం స్వార్థ రాజ‌కీయాలు చేస్తోందని ఆయ‌న ఆరోపించారు. ఎన్నిక‌ల్లో త‌మ త‌ర‌ఫున‌ డ‌బ్బు సంచులు పంపిన వారికి ఇప్పుడు ప్ర‌భుత్వం దోచిపెడుతోందని ఆయ‌న వ్యాఖ్యానించారు. భారీవ‌ర్షాలు కురిసినప్పటికీ కూడా ప్ర‌భుత్వ నేత‌ల నుంచి స్పందన లేద‌ని ఆయ‌న అన్నారు. ఏపీలో అన్ని ప్ర‌భుత్వం శాఖ‌ల‌ను అవినీతిలో ముంచేశారని ఆరోపించారు.

More Telugu News