: 9న పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్ నిఖిత

ప్రముఖ సినీ నటి నిఖితా తుక్రాల్ పెళ్లి పీటలెక్కనుంది. అక్టోబర్ 9న ముంబయికి చెందిన వ్యాపారవేత్త గగన్‌ దీప్‌ సింగ్ ను వివాహం చేసుకోనుంది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహ బంధం ద్వారా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో హీరోయిన్ నిఖిత, గగన్ దీప్ సింగ్ పెళ్లికి ఇరువురి కుటుంబాలు ముహూర్తాన్ని ఫిక్స్ చేసాయి. ఈ నెల 9న ముంబైలోని ఓ స్టార్ హోటల్‌ లో తమ వివాహం ఘనంగా జరగనుందని నిఖిత తెలిపింది. ఉత్తరాది సంప్రదాయం ప్రకారం నేటి నుంచే వివాహ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని చెప్పింది. నేడు మెహంది, సంగీత్ కార్యక్రమాలు జరుగనుండగా శని, ఆది వారాల్లో వివాహం జరుగనున్నట్లు ఆమె తెలిపారు. వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని నిఖిత చెప్పింది. వివాహానంతరం సినిమాల్లో నటించడంపై భర్తతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని నిఖిత తెలిపింది. కాగా, 'హాయ్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై 'కళ్యాణ రాముడు', 'సంబరం', 'ఖుషిఖుషీగా', 'డాన్‌', 'అనసూయ' తదితర చిత్రాలతో నిఖిత గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News