: స‌రిహ‌ద్దు ప్రాంతాల‌కు భారీగా యుద్ధసామగ్రి తరలింపు.. విమానాలు, హెలికాప్టర్లతో ఎయిర్‌ఫోర్స్ గస్తీ

నియంత్ర‌ణ రేఖ‌ను దాటి భార‌త‌సైన్యం చేసిన దాడితో బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ మ‌న దేశంపై ఏ క్ష‌ణానైనా దాడికి దిగే అవ‌కాశాలు ఉండ‌డంతో, దానిని ఎదుర్కునే క్రమంలో భార‌త్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. పాక్ ఈరోజు ఉద‌యం కూడా కాల్పులు చేసి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగిన నేప‌థ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ‌, ర‌క్ష‌ణ‌శాఖ అధికారులు ఎట్టి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కునేందుకు త్రివిధ ద‌ళాల‌ను సంసిద్ధం చేసి, ప‌లు సూచ‌న‌లు చేశారు. దీంతో విమానాలు, హెలికాప్టర్లతో ఎయిర్‌ఫోర్స్ గస్తీ నిర్వ‌హిస్తోంది. స‌రిహ‌ద్దు ప్రాంతాల‌కు ఆర్మీ భారీగా యుద్ధసామగ్రిని త‌ర‌లిస్తోంది. మ‌రోవైపు స‌ముద్ర తీరాల్లోనూ అధికారులు నేవీని అప్ర‌మ‌త్తం చేశారు. విమానాల్లో, హెలికాప్ట‌ర్ల‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే సమస్యలను పరిష్కరించేలా ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు. మ‌రోవైపు, పాక్ స‌రిహ‌ద్దులోని ప్ర‌జ‌లు సామగ్రి సర్దుకొని వెళుతూ కనిపిస్తున్నారు. యుద్ధం సంభ‌విస్తే త‌మ‌పై ఏ బాంబు ప‌డుతుందోన‌ని భ‌య‌ప‌డుతున్న‌ట్లు మీడియాతో మాట్లాడుతూ వారు చెబుతున్నారు. దేశంలోని సున్నిత ప్రాంతాల్లోనూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి. జమ్ముకశ్మీర్ లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అక్కడి పలు ప్రాంతాల వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

More Telugu News