: భారత్‌-పాక్‌ ఉద్రిక్త పరిస్థితులపై బాన్‌కీమూన్‌ దృష్టి సారించారు: ఐక్యరాజసమితి మిలటరీ విభాగం

పాకిస్థాన్ ఉగ్ర‌వాదులు యూరీలోని భార‌త‌సైనిక శిబిరాల‌పై దాడి చేసిన‌ అనంతరం ఇరుదేశాల‌ మధ్య నెలకొన్న పరిస్థితులను ఐక్యరాజసమితి మిలటరీ విభాగం అధికారులు గ‌మనిస్తున్నారు. ఈ అంశంపై ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజరిక్ స్పందిస్తూ.. నియంత్ర‌ణ రేఖ‌ను దాటి భారత సైనికులు ఉగ్ర‌వాద శిబిరాల‌పై జరిపిన స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌ నేపథ్యంలో మ‌రింత ఉద్ధృత‌మైన ప‌రిస్థితుల‌పై త‌మ చీఫ్ బాన్‌కీమూన్‌ దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. త‌మ‌ మిలటరీ అబ్జర్వర్‌ గ్రూప్‌ (యూఎన్‌ఎంవోజీఐపీ) అక్క‌డ కొన‌సాగుతున్న ప‌రిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు నివేదికను తెప్పించుకుంటోంద‌ని ఆయ‌న అన్నారు. ఇరు దేశాలు సంయమనం పాటించి చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ల‌కు మార్గాన్ని ఆలోచించాల‌ని ఆయ‌న‌ సూచించారు. దేశాల మ‌ధ్య త‌లెత్తే ఉద్రిక్త ప‌రిస్థితులను స‌మీక్షించి, సూచ‌న‌లు చేసే యూఎన్‌ ఎంవోజీఐపీని ఐరాస అధికారులు 1949 జనవరి 24న ఏర్పాటు చేశారు. అందులో స్వీడన్‌కు చెందిన మేజర్‌ జనరల్‌ పెర్‌ గుస్తాఫ్‌ లోదిన్ స‌మ‌క్షంలో 10 దేశాలకు చెందిన అబ్జ‌ర్వర్లు ఉన్నారు. ప్ర‌స్తుతం అందులో ఆయా దేశాల‌కు చెందిన‌ 41 మంది అబ్జర్వర్లు ఉన్నారు. దేశాల మధ్య తలెత్తే స‌మ‌స్య‌ల‌పై వీరు నివేదిక సేక‌రించి ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తారు.

More Telugu News