: జూనియర్ ఎన్టీఆర్ స్విట్జర్లాండ్ లో రాత్రి 12 వరకు మేలుకుని వ్యవసాయ కార్యక్రమాలు టీవీ లో చూసేవాడు: రాజమౌళి

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాజమౌళి, ఇటీవల బాహుబలి షూటింగ్ లో బిజీ కావడం వల్ల కాస్త వెనకబడి ఉన్నాడు. అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తున్నాడు. ఇక ఇప్పుడు బాహుబలి ప్రమోషన్ పెంచాల్సిన సమయం దగ్గర పడుతుండడంతో ఇకపై చురుగ్గా స్పందించే ప్రయత్నాలు ప్రారంభించాడు. అందులో భాగంగా వరుస ట్వీట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. తాను దర్శకుడిగా మారి 15 ఏళ్లు అయిందని గుర్తుచేసుకున్నాడు. డబ్బింగ్, ఎడిటింగ్ అసిస్టెంట్ గా చేరి 25 ఏళ్లైందని, అయితే తాను సినీ పరిశ్రమలోకి వచ్చి అంతకాలం ముగిసినట్టు అనిపించడం లేదని అన్నాడు. ఈ సందర్భంగా 'స్టూడెంట్ నెంబర్ 1' షూటింగ్ కు స్విట్జర్లాండ్ కు వెళ్లగా, అక్కడ తారక్ కు, తనకు ఒకే రూమ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తనకేమో 9 గంటలకే నిద్రపోవడం అలవాటని, తారక్ కి రాత్రి 12 గంటల వరకు టీవీ చూసే అలవాటని, అది కూడా వ్యవసాయ కార్యక్రమాలు చూస్తాడని, స్విట్జర్లాండ్ లో ఒకే ఛానెల్ లో ఆ కార్యక్రమాలు ప్రసారమయ్యేవని తెలిపాడు. 'అది ఎప్పుడు గుర్తొచ్చినా తారక్ ని తిట్టుకుంటాను' అని ఆయన చెప్పారు. స్టూడెంట్ నెంబర్ వన్ విజయం క్రెడిట్ ను కథ అందించిన పృథ్వీతేజకి, సంగీతం అందించిన కీరవాణికి ఇస్తానని తెలిపాడు. సినిమా విజయం సాధించిన తరువాత విజయయాత్రకు వెళ్లినప్పుడు తారక్ ను హీరోగా ఆదరించడం చూశానని, అతనిని చూసేందుకు పెద్దవాళ్లు సైతం వచ్చేవారని రాజమౌళి తెలిపాడు. అప్పటి తన దర్శకత్వ ప్రతిభను చూసుకుంటే పరిణతి చెందనట్టు అనిపిస్తుందని, కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ చాలా బాగా నటించాడని కితాబునిచ్చారు.

More Telugu News