: ప్రపంచంలోని ఆ 15 మందిలో చోటు సంపాదించుకున్న హైదరాబాదీ

18 ఏళ్ల హైదరాబాదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్య కళాశాలలైన ఇంపీరియల్‌ కాలేజ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, క్వీన్‌ మేరీ మేడికల్‌ స్కూల్‌, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ మెడికల్‌ స్కూల్‌ లలో రాహుల్‌ రమేష్ కు ఎంబీబీఎస్‌ కోర్సులో అడ్మిషన్‌ లభించింది. ఇక్కడ మనం ఎంసెట్ రాస్తే వచ్చే ఎంబీబీఎస్ కోర్సుకి, ఈ ఎంబీబీఎస్ కి చాలా తేడా ఉంది. బ్రిటన్‌ లోని లండన్‌ లో ఉన్న ఈ మూడు మెడికల్ కాలేజీల్లో సీటు కోసం ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు పోటీ పడితే, కేవలం 15 మందికి మాత్రమే సీట్లు లభిస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత వరకు ఎవరూ ఈ కళాశాలల్లో సీటు సంపాదించలేదు. సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రి మెడికల్‌ కోర్సు చేసిన హైదరాబాదుకు చెందిన రాహుల్‌ రమేశ్‌ యూకే క్యాట్‌, బీ మ్యాట్‌, శాట్‌ వంటి పరీక్షలు, ప్యానెల్‌ ఇంటర్వ్యూలు, స్కూల్‌ పర్ఫార్మెన్స్‌ రివ్యూలను విజయవంతంగా అధిగమించి ఈ ప్రతిష్టాత్మక కళాశాలల్లో అడ్మిషన్‌ సాధించాడు. కేవలం 15 మంది ప్రపంచవ్యాప్త విద్యార్థులకు సీట్లు లభించగా, అందులో రాహుల్ ఒకరు కావడం విశేషం. ప్రతిష్టాత్మక ఇంపీరియల్‌ కాలేజ్‌ మెడికల్‌ స్కూల్‌ లో ఎంబీబీఎస్‌ కోర్సు చేయాలని నిర్ణయించుకున్న రాహుల్‌ అందుతగ్గ పరిశ్రమతో సీటు దక్కించుకోవడం విశేషం. అక్టోబర్‌ 1 నుంచి రాహుల్ ఎంబీబీఎస్ విద్యనభ్యసించనున్నాడు. కాగా, 2015 టైమ్స్‌ హయ్యర్ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ లో ప్రపంచంలోనే ఐదో ఉత్తమ కళాశాలగా, యూరప్‌ లో రెండో బెస్ట్‌ మెడికల్‌ కాలేజీగా ఇంపీరియల్‌ కాలేజీ నిలిచింది.

More Telugu News