: అమెరికా సైన్యంపై తొలి రసాయన దాడి చేసిన ఐఎస్ఐఎస్!

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పీచమణిచేందుకు పోరాటం చేస్తున్న అమెరికా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాక్ లో ఉన్న అమెరికా సైన్యం, ఉగ్రవాదులతో పోరాడుతున్న వేళ, రసాయన దాడి జరిగింది. మిలిటెంట్లు అత్యంత ప్రమాదకర రసాయనాలను కూర్చిన బాంబులను ప్రయోగించినట్టు తెలుస్తోందని పెంటగాన్ ప్రతినిధి తెలిపారు. అమెరికా సైన్యంపై జరిగిన తొలి రసాయన దాడి ఇదేనని వివరించారు. అమెరికా జవాన్లు ఉన్న ఖురయ్యా ఎయిర్ ఫీల్డ్ ప్రాంతంలో ఒకే ఒక్క బాంబు షెల్ లో రసాయన అవశేషాలు ఉన్నాయని నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ వెల్లడించారు. దీన్ని ఓ రాకెట్ లేదా మోర్టార్ ద్వారా ప్రయోగించి ఉంటారని, సైనికులు ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఇందులో మస్టర్డ్ గ్యాస్ ను వాడారని, ఈ విషవాయువు తగిలితే, శరీరం కాలిపోవడం, అంధత్వం, శాశ్వత వికలాంగత్వం సంభవిస్తాయని తెలిపారు. రసాయన ఆయుధాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు గ్యాస్ మాస్కులు సహా, అన్ని రకాల రక్షణ సాధనాలూ యూఎస్ సైన్యం వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.

More Telugu News