: చంద్రబాబుకి మనమే కటీఫ్ చెబితే... లాభనష్టాలపై విశ్లేషించిన బీజేపీ!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదని కేంద్రం ప్రకటించిన తరువాత, ఉద్యమం కొనసాగుతున్న వేళ, తప్పంతా బీజేపీదేనని చెబుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజల ముందు ఓ పథకం ప్రకారం తమను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ నేతలు అనుమానాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరో రెండేళ్ల తరువాత ఎన్నికలు జరిగే ముందు చంద్రబాబు, బీజేపీని విమర్శిస్తూ, కటీఫ్ చెబుతారని, అది జరిగే ముందే బీజేపీయే తెగతెంపులు చేసుకుంటే సంస్థాగతంగా ఎదగవచ్చని పలువురు బీజేపీ నేతలు అధిష్ఠానం పెద్దల ముందు వ్యాఖ్యానించినట్టు సమాచారం. బీజేపీ జిల్లా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్ లతో గత వారంలో కేంద్రం నుంచి వచ్చిన అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్ లు సమావేశమైన వేళ, బీజేపీయే ముందుగా స్పందించి తెలుగుదేశంతో విడిపోతే వచ్చే లాభనష్టాలపై రాష్ట్ర నేత కందుల రాజమోహన్ రెడ్డి చేసిన ప్రసంగం, రాజకీయ విశ్లేషణ అందరినీ ఆకర్షించిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన తన ప్రసంగంలో, కాంగ్రెస్ పార్టీని మరో పదేళ్ల వరకూ ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఇదే సమయంలో ప్రజా విశ్వాసాన్ని చూరగొనడంలో వైకాపా విఫలమవుతోందని చెబుతూ, కొత్తగా ఓటు హక్కు వచ్చే యువతకు బీజేపీ దగ్గర కావచ్చని చెప్పారట. చంద్రబాబునాయుడు అమరావతి పేరిట కోస్తాపై దృష్టి పెట్టారని మిగతా ప్రాంతాల ప్రజలు దూరమవుతున్నారని, రాయలసీమలో ఆయనపై వ్యతిరేకత పెరిగిందని, ఉత్తరాంధ్ర వాసులు తమను పట్టించుకోవడం లేదని భావిస్తున్నారని గుర్తు చేస్తూ, ఆయనతో కటీఫ్ చెబితేనే బాగుంటుందని విశ్లేషించారట. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకన్నా ముందే బీజేపీ స్పందించాలని ఆయన సూచించగా, ఇప్పటికిప్పుడు ఇలాంటి అంశాలు బయటకు వెళితే బాగోదని, శివసేనతో సైతం ఇలాగే సంబంధం కొనసాగిస్తున్నామని చెప్పిన కేంద్రం నేతలు, సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దామని చెప్పినట్టు సమాచారం.

More Telugu News