: యాంటీ బ్యాక్టీరియల్‌ సబ్బులతో నష్టాలే ఎక్కువట.. అమెరికాలో నిషేధం విధించిన అధికారులు

యాంటీ బ్యాక్టీరియల్‌ సబ్బులను చాలా కాలం పాటు ఉప‌యోగిస్తే శ‌రీరానికి మంచి జరగడం మాట అటుంచి, చెడు జరుగుతోందని తేలడంతో, అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఆ స‌బ్బుల‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో 19 రకాల యాంటీ బ్యాక్టీరియ‌ల్‌ ఉత్పత్తులపై ప్ర‌భావం ప‌డ‌నుంది. ట్రైక్లోసిన్‌, ట్రైక్లోకార్బన్‌ వంటివాటిని ఇక‌పై వాడుక‌లో ఉంచ‌కూడ‌ద‌ని ఎఫ్‌డీఏ పేర్కొంది. వీటిని వినియోగించే యాంటీ బాక్టీరియల్‌ వాష్‌లను అమ్మ‌కానికి ఉంచ‌కూడ‌ద‌ని తెలిపింది. యాంటీ బ్యాక్టీరియల్‌ సబ్బులను వినియోగిస్తే ఇన్ఫెక్షన్లను నివారించుకోవ‌చ్చ‌ని ప్ర‌చారం చేస్తోన్న సంస్థ‌లు ఆ అంశాన్ని నిరూపించలేకపోయాయి. ఈ అంశంపై ఎఫ్‌డీఏకు చెందిన సెంటర్‌ ఫర్‌ డ్రగ్‌ అండ్‌ ఎవల్యూషన్‌ రిసెర్చి(సీడీఈఆర్‌) డైరెక్టర్‌ జానెట్‌ వుడ్‌కాక్ మాట్లాడుతూ.. స‌హ‌జంగా క‌స్ట‌మ‌ర్లు యాంటీ బాక్టీరియల్‌ సబ్బును ఇన్ఫెక్షన్ల నివారణ కోసం వినియోగించాల‌ని అనుకుంటార‌ని తెలిపారు. అయితే ఆ స‌బ్బులు కూడా మామూలు సబ్బులలాగే ప‌నిచేస్తున్నాయ‌ని, వాటిలో వెరైటీ ఏమీ లేద‌ని చెప్పారు. అంతేగాక‌, ఆ స‌బ్బుల‌ను ఎక్కువ కాలం వినియోగిస్తే నష్టాలు ఎక్కువగా ఉన్న‌ట్లు తేలింద‌ని పేర్కొన్నారు.

More Telugu News