: అమ్మ బాగుంది...ఆందోళన వద్దు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యం కుదుట పడిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన సద్భావనా అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆమె కోలుకుంటున్నారని, త్వరలోనే లేచి తిరుగుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి తను కూడా రావాలనుకున్నారని, అయితే తాను, తన సోదరి ప్రియాంక ఆమెను రానివ్వలేదని చెప్పారు. ఆమెకు మరి కొంత కాలం విశ్రాంతి అవసరమనే తామిద్దరం అలా చేశామని ఆయన తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వారణాసిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం తీవ్ర అనారోగ్యం పాలైన సోనియా గాంధీ 11 రోజుల పాటు ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె భుజానికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఈ తతంగం మొత్తాన్ని రాహుల్ గాంధీ మీడియాకు వివరించారు.

More Telugu News