: ఆయనకు తెలిసిన మంత్రమొక్కటే: పుల్లెల గోపీచంద్ భార్య

గతంలో చాలా మంది క్రీడాకారులు పుల్లెల గోపీచంద్ అకాడమీకి వచ్చి వెళ్లిపోయారని, ఇక్కడికి ఎవరు వచ్చినా వారికి సహాయపడటమే ఆయనకు తెలిసిన మంత్రమని గోపీచంద్ భార్య పీవీవీ లక్ష్మి అన్నారు. గోపీచంద్ శిష్యురాలు పీవీ సింధు రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ ఫైనల్ కు చేరిన సందర్భంగా లక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫైనల్ కు చేరిన సింధుకు పతకం ఖాయమని అన్నారు. సైనా నెహ్వాల్, కశ్యప్, శ్రీకాంత్, గుత్తా జ్వాల, పీవీ సింధు కారణంగా బ్యాడ్మింటన్ కు మన దేశంలో ఆదరణ పెరిగిందన్నారు. అయితే, ఈ క్రీడకు సంబంధించిన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం చదువుపై మాత్రమే కాకుండా, క్రీడలపై కూడా పిల్లలు దృష్టి కేంద్రీకరించేందుకు సింధు సాధించిన విజయాలు దోహదపడతాయన్నారు. కఠోర శ్రమ, అంకితభావానికి మారుపేరు గోపీచంద్ అని లక్ష్మి పేర్కొన్నారు.

More Telugu News