: ఓపెనర్‌గా వచ్చేందుకు నేను సిద్ధమే: విరాట్‌ కోహ్లీ

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తాను ఎప్పుడూ మూడో స్థానంలోనే వ‌స్తుండ‌డంతో ఆ అంశంపై త‌న‌ను చాలా మంది ప్ర‌శ్నిస్తున్నార‌ని భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. తానేమీ మూడో స్థానంలోనే బ్యాటింగ్‌ చేయాలని చుట్టూ గీతగీసుకోలేద‌ని ఆయన అన్నాడు. టీమ్ అవసరాల మేరకు తాను ఓపెనర్‌గా కూడా బ‌రిలోకి దిగేందుకు సిద్ధమేన‌ని చెప్పాడు. టీమ్‌లో ఉన్న‌ నియమాలు అందరికీ వర్తిస్తాయని అన్నాడు. వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-0తో సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. చివ‌రి మ్యాచు ఎల్లుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ కైవ‌సం కావ‌డంతో ఆ మ్యాచులో బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చాలని కోహ్లీ భావిస్తున్నాడు. వ‌చ్చేనెల‌ 22 నుంచి భార‌త్‌లో న్యూజిలాండ్ టీమ్‌తో టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేల సిరీస్‌ ఆడనుంది. దీంతో ప్ర‌యోగాలు చేసి టీమిండియా టాప్‌ ఆర్డర్‌ను మ‌రింత బ‌ల‌ప‌ర్చాల‌ని ఆయ‌న చూస్తున్నాడు. ఇప్ప‌టికే మూడో టెస్టులో పుజారా స్థానంలో రోహిత్‌ శర్మ మైదానంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, రోహిత్ మొద‌టి ఇన్సింగ్స్ లో 9, రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు మాత్ర‌మే చేశాడు. అయిన‌ప్ప‌టికీ రోహిత్‌కి కోహ్లీ మరో అవకాశమివ్వాలని చూస్తున్నాడు. అంతేగాక‌, నాలుగో స్థానంలో ర‌హానె, ఐదో స్థానంలో రోహిత్‌ శర్మలను బ్యాటింగ్‌కు దింపాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఇక కోహ్లీ మూడో స్థానంలోనే దిగుతాడ‌ట‌.

More Telugu News