: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ నగరంలో కాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. టెక్సాస్ లో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన ఆస్టిన్ లో నేటి తెల్లవారుజాము పీడకలగా మారింది. డౌన్ టౌన్ ప్రాంతంలో సాయుధుడైన దుండగుడు రెండు చోట్ల కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 30 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తూటాల గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. డౌన్ టౌన్ లోని ఈస్ట్ స్ట్రీట్ 208 వద్ద తూటాగాయాలైన క్షతగాత్రులను గుర్తించామని, వారిని బ్రాకెన్ రిడ్జ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు చికిత్స నిమిత్తం తరలించామని వారు వెల్లడించారు. కాగా, ఆగంతుకుడు ఇంకా పరారీలో ఉండడంతో డౌన్ టౌన్ లో ప్రజలెవరూ బయటకు రావద్దని, ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ దుండగుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

More Telugu News