: డ్రగ్ రాకెట్ కేసు: బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి బ్యాంక్ అకౌంట్లు సీజ్

డ్రగ్ రాకెట్ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి బ్యాంకు అకౌంట్లను థానే పోలీసులు సీజ్ చేశారు. ఎనిమిది ప్రాంతాల్లో ఉన్న ఆమె అకౌంట్లను సీజ్ చేశామని, వాటిలో మొత్తం రూ.93 లక్షల నగదు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ఈ డ్రగ్ కేసు‌లో గత నెల పోలీసులు కులకర్ణిని ప్రధాన నిందితురాలిగా పేర్కొన్నారు. అంతర్జాతీయ డ్రగ్ వ్యాపారి విక్కీ గోస్వామి.. కులకర్ణి భర్త అయి ఉండవచ్చని భావిస్తున్నారు. కులకర్ణి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసిన అనంతరం ఆమె సోదరిని పిలిపించి ప్రశ్నిస్తున్నారు. కోర్టు నుంచి ఆదేశాలు అందగానే కులకర్ణి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. మమతా కులకర్ణి భర్తగా భావిస్తున్న గోస్వామి కంపెనీకి ఆమె మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆమెను దోషిగా నిలబెట్టడానికి ఈ ఒక్క కారణం సరిపోతుందని పోలీసులు పేర్కొన్నారు. రూ.2వేల కోట్ల రూపాయల విలువైన 18.5 టన్నుల ఎఫిడ్రిన్‌ను పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీజ్ చేసిన సంగతి తెలిసిందే. షోలాపూర్‌లోని ఎవోన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్‌లో ప్రాసెసింగ్ అనంతరం విదేశాలకు పంపించేందుకు సిద్ధంగా ఉన్న ఎఫిడ్రిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటి మమతా కులకర్ణిని ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ చార్జ్‌షీట్‌లో ఆమె పేరు చేర్చారు.

More Telugu News