: మీ పని మీరు చూసుకుంటే బెటర్.. అమెరికాను హెచ్చరించిన టర్కీ అధ్యక్షుడు

టర్కీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మాని మీ పని మీరు చేసుకుంటే బాగుంటుందని యూరోపియన్ యూనియన్, అమెరికా సహా పశ్చిమ దేశాలకు టర్కీ అధ్యక్షుడు తయ్యపి ఎర్డోగాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల దేశాధ్యక్షుడిపై తిరుగుబాటు చేసిన సైన్యం ఆ విషయంలో విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో తిరుగుబాటుకు పాల్పడిన సైనికులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ విషయంపై అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేశాయి. తిరుగుబాటుదారులను హింసించడం మానుకోవాలని పిలుపునిచ్చాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఎర్డోగాన్ ‘‘కొంతమంది మాకు సలహాలు ఇవ్వాలని చూస్తున్నారు. మీ పని మీరు చేసుకోండి. మీ ఇంటిని మీరు చక్కదిద్దుకోండి. తర్వాత సలహాలిద్దురు గాని’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టర్కీలో పెద్ద ఎత్తున సైనిక తిరుబాటు జరిగితే అటు యూరోపియన్ యూనియన్ నుంచి కానీ, పశ్చిమ దేశాల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి పరామర్శించ లేదని పేర్కొన్న అధ్యక్షుడు ఉచిత సలహాలు ఇచ్చేందుకు మాత్రం ముందుకొస్తున్నారని మండిపడ్డారు. ‘‘టర్కీ ప్రజాస్వామ్యం గురించి , ప్రజల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేయని పలు దేశాధినేతలు.. టర్కీపై తిరుగుబాటుకు పాల్పడిన వారి గురించి మాత్రం ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారు మాకు ఎప్పటికీ మిత్రులు కాజాలరు’’ అని కుండ బద్దలు గొట్టారు.

More Telugu News