: జబాంగ్ ను కొనేసిన మైంత్రా!

ఫ్లిప్ కార్ట్ అనుబంధ సంస్థగా ఉన్న మైంత్రా, ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ బ్రాండ్ జబాంగ్ ను విలీనం చేసుకుంది. గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్ గొడుగు కింద ఉన్న జబాంగ్ ను కొనుగోలు చేశామని చెప్పిన మైంత్రా, ఎంత మొత్తాన్ని ఈ డీల్ కోసం వెచ్చించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ-కామర్స్ స్టార్టప్ గా ఉన్న మైంత్రాను 2014లో రూ. 2 వేల కోట్లతో ఫ్లిప్ కార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. "జబాంగ్ విలీనంతో భారత ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ సెగ్మెంట్ లో ఫ్లిప్ కార్ట్ గ్రూప్ మార్కెట్ వాటా మరింతగా పెరుగుతుందని భావిస్తున్నాం. 1,500కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను అందిస్తున్న జబాంగ్ చేరిక మాకెంతో లాభదాయకం" అని మైంత్రా ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియాలో అతిపెద్ద ఫ్యాషన్ రిటెయిలర్ గా నిలవాలన్న తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు వేస్తున్న అడుగుల్లో ఇదొకటని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనంత్ నారాయణన్ వెల్లడించారు. జబాంగ్ టీమ్ తో కలసి పనిచేసి మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కాగా, 2012లో ఏర్పాటైన జబాంగ్ ను స్వీడన్ కు చెందిన ఇన్వెస్ట్ మెంట్ సంస్థ కిన్నెవిక్ భారీ పెట్టుబడులతో ప్రోత్సహించింది.

More Telugu News