: భాజాపాను ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ

బీజేపీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అందుకు కారణాలను వెల్లడించారు. తనను పంజాబ్ కు దూరం చేయాలని బీజేపీ పెద్దలు ప్రయత్నించారని, వారి వైఖరికి తానెంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, అన్ని ధర్మాలలోకీ రాష్ట్ర ధర్మమే గొప్పదని, తన సొంత రాష్ట్రానికి సేవ చేయాలన్న ఆశ తప్ప, తనకు పదవులపై ఆశ లేదని చెప్పారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను వదలి ఉండలేకనే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తన మూలాలను తన నుంచి దూరం చేసే పనికి వ్యతిరేకంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను ఇప్పటివరకూ నాలుగు సార్లు ఎన్నికల్లో విజయం సాధించానని గుర్తు చేసిన సిద్ధూ, కేవలం సెలబ్రిటీ అయినందునే గెలుస్తున్నట్టు ప్రత్యర్థులు చేసిన ఆరోపణలను ఖండించారు. సెలబ్రిటీ అయితే, ఒక్కసారి మాత్రమే గెలుస్తారని, ఆపై చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మాత్రమే ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని వివరించారు.

More Telugu News