: నీస్ దాడికి రెండు రోజుల ముందు ఉగ్రవాది రెక్కీ.. తుపాకి అందినట్టు మెసేజ్

ఫ్రాన్స్ లోని నీస్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ముందు ఉగ్రవాది మొహమ్మద్ బౌహ్లెల్(31) ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్టు వెల్లడైంది. బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రజలపైకి ట్రక్కుతో దాడిచేసిన ఉగ్రవాది 84 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 300 మంది క్షతగాత్రులయ్యారు. ట్యునీషియన్ అయిన మొహమ్మద్ దాడికి రెండు రోజుల ముందు వేడుకలు జరిగే ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడు. అనంతరం తన ఫోన్ నుంచి ఓ టెక్ట్స్ మెసేజ్ పంపించాడు. ‘‘7.65 ఎంఎం తుపాకి అందడంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే ఇతర ఆయుధాల గురించి ప్రస్తావించాడు’’ అని దర్యాప్తులో వెల్లడైనట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే తాను డ్రైవ్ చేసిన 19 టన్నుల ట్రక్కులో కూర్చుని సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఉగ్రదాడి ఘటనలో పోలీసులు ఆదివారం మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. వీరిని ప్రశ్నిస్తున్న అధికారులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఇంతకుముందు అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.

More Telugu News