: హైదరాబాదీ బిర్యానీ, వెజ్ సమోసా, సాగ్ పనీర్... బ్రిటన్ ప్రధానిగా కామెరూన్ చివరి భోజనం!

యూకేలో బ్రెగ్జిట్ ఆనంతరం తన పదవికి రాజీనామా చేసిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, '10 డౌనింగ్ స్ట్రీట్' (బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం)లో చివరి మంత్రి వర్గ సమావేశంలో పాల్గొని విందారగించిన వేళ, పలు భారతీయ వంటకాలను ఆయన రుచి చూశారు. హైదరాబాదీ బిర్యానీ, కాశ్మీరీ రోగన్ ఘోష్, వెజ్ సమోసా, సాగ్ పనీర్, పాలక్ గోస్ట్, రైస్ తదితరాలు మెనూలో చోటు చేసుకున్నాయి. ఆయన ప్రధాని హోదాలో చేసిన చివరి విందుకు తాము ఆహారాన్ని అందించామని సెంట్రల్ లండన్ లో సేవలందిస్తున్న 'కెన్నింగ్టన్ తండూరీ' అనే రెస్టారెంట్ ట్వీట్ చేసింది. వీటితో పాటు నషాలీ గోస్ట్, కేటీ మిక్సెడ్ గ్రిల్, చికన్ జల్ ఫ్రాజీ, సాగ్ ఆలూ, నాన్ తదితరాలు వడ్డించినట్టు రెస్టారెంట్ మేనేజర్ డాక్టర్ కోసర్ హోక్ తెలియజేశారు. ఈ రెస్టారెంటు బ్రిటన్ లోని అన్ని రాజకీయ పార్టీల నేతలకూ ఫేవరెట్ అని తెలుస్తోంది. 1985 లో ప్రారంభమైన ఈ రెస్టారెంటును పలువురు విదేశీ ప్రముఖులు కూడా సందర్శించారు.

More Telugu News