: ‘ఆపిల్’పై వెయ్యి కోట్ల దావా వేసిన ఫ్లోరిడా వాసి

1992లోనే తాను రూపొందించిన ఎలక్ట్రానిక్ రీడింగ్ డివైస్ (ఈఆర్ డీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ ‘ఆపిల్’ కాపీ కొట్టిందంటూ ఫ్లోరిడాకు చెందిన థామస్ రాస్ అనే వ్యక్తి ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఆపిల్ సంస్థపై వెయ్యి కోట్ల డాలర్లకు దావా వేశాడు. ఈ విషయం ‘మ్యాక్ రూమర్స్ డాట్ కామ్’ అనే వెబ్ సైట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. పదహేరేళ్ల క్రితం ఏర్పాటైన ఈ వెబ్ సైట్ ఎక్కువగా ఆపిల్ సంస్థ ఉత్పత్తుల గురించే కాకుండా వాటికి సంబంధించిన ఊహాగానాలను కూడా పోస్ట్ చేస్తుంటుంది. ‘ఆపిల్’ పై థామస్ రాస్ చేసిన ఆరోపణలను కూడా ఈ వెబ్ సైటే పేర్కొంది. 'ఈ ఆర్ డీ'కి సంబంధించి థామస్ రాస్ గతంలో రూపొందించిన డ్రాయింగ్ ప్రతిని కూడా తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. కాగా, నవలలు, వ్యాసాలు చదువుకోవడానికి, ఫొటోల బ్రౌజింగ్ కు, వీడియోలు చూసేందుకని థామస్ ఈ డివైస్ కు రూపకల్పన చేశాడు. ఈ డిజైన్ పేటెంట్ కోసం 1992లో అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్క్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, పేటెంట్ నిమిత్తం చెల్లించాల్సిన ఫీజును థామస్ చెల్లించకపోవడంతో థామస్ దరఖాస్తును సదరు కార్యాలయం 1995లో తిరస్కరించిందని సమాచారం. ‘ఆపిల్’పై వేసిన దావాలో థామస్ కనుక గెలిస్తే వెయ్యికోట్లతో పాటు ఏడాదికి 350 కోట్ల డాలర్లను సంస్థ చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు అంచన వేసినట్లు తెలుస్తోంది.

More Telugu News