: విజయ్ మాల్యాతో కుమ్మక్కయిన ఎస్బీఐ: స్టాండర్డ్ చార్టర్డ్ సంచలన ఆరోపణ

యూబీ గ్రూప్ అధినేతగా విజయ్ మాల్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం అధికారులతో కుమ్మక్కయ్యారని, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సంచలన ఆరోపణలు చేసింది. ఆయన రుణాన్ని చెల్లించలేకపోయిన తరువాత, డెట్ రికవరీ ట్రైబ్యునల్ మధ్యంతర ఆదేశాలు ఇవ్వగా, వాటిని వెనక్కు తీసుకునేందుకు కన్సార్టియం ఉన్నతోద్యోగులకు మాల్యా భారీ ఎత్తున ముడుపులు ఇచ్చారని ఆరోపించింది. బ్రిటీష్ లిక్కర్ సంస్థ డియాజియోతో డీల్ కు ముందు ఇది జరిగిందని తెలిపింది. ఈ మేరకు ట్రైబ్యునల్ ప్రిసైడింగ్ అధికారి సీఆర్ బెనకనహళ్ళి ముందు బ్యాంకు తరఫు న్యాయవాది జీ కృష్ణమూర్తి వాదించారు. డియాజియోతో ఎలాంటి లావాదేవీలూ వద్దని ట్రైబ్యునల్ మధ్యంతర ఆదేశాలను జారీ చేసిన వేళ, మాల్యా వ్యతిరేకించలేదని, అంటే ఆయన అప్పటికే బ్యాంకులతో కుమ్మక్కయినట్టు తెలుస్తోందని ఆయన అన్నారు. వాస్తవానికి ఆయన మధ్యంతర ఆదేశాలను వ్యతిరేకించి, వాటిని రద్దు చేయించుకోవచ్చని, కానీ బ్యాంకులే వాటిని రద్దు చేయించాయని గుర్తు చేశారు. కాగా, ఆపై 2012లో యూబీ గ్రూపులోని మెజారిటీ వాటాలను డియాజియో సొంతం చేసుకుంది.

More Telugu News