: విజేందర్ సింగ్ ప్రత్యర్ధి ఆస్ట్రేలియన్... ఒత్తిడి విజేందర్ పైనే ఉంటుందంటున్న ఆసీస్ బాక్సర్

భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ తదుపరి పోరాటానికి డబ్ల్యూబీవో ప్రత్యర్ధిని ఖరారు చేసింది. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన అనంతరం వరుసగా ఆరు బౌట్ లలో గెలిచిన విజేందర్ ఈ నెల 16న ఢిల్లీలోని త్యాగరాయ స్టేడియంలో ఏడవ బౌట్ ఆడనున్నాడు. ఇందులో చైనా లేదా కొరియన్ తో విజేందర్ తలపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొనగా, మాజీ యూరోపియన్ ఛాంపియన్, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ కెర్రీ హోప్ ను డబ్ల్యూబీవో ఎంపిక చేసింది. ఇప్పటి వరకు 30 బౌట్ లు ఆడిన కెర్రీ 23 బౌట్లలో విజయం సాధించగా, రెండు బౌట్ లలో నాకౌట్ గా నిలిచాడు. తదుపరి పోరుపై హోప్ మాట్లాడుతూ, 'విజేందర్ సింగ్ భారత్ లో సూపర్ స్టార్ కావచ్చు, కానీ నావరకు మాత్రం అతను జస్ట్ బాక్సర్' అని చెప్పాడు. అదీకాక అతను ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి అడుగుపెట్టి కేవలం ఏడాది మాత్రమే అయిందని, సొంత దేశంలో ఆడుతుండడంతో అభిమానులు ఆదరణతో పాటు అంతే స్థాయిలో ఒత్తిడి కూడా ఉంటుందని చెప్పాడు. దానిని తాను క్యాష్ చేసుకుంటానని అన్నాడు. అండర్ డాగ్ గా బరిలో దిగి విజేందర్ పై విజయం సాధిస్తానని కెర్రీ హోప్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

More Telugu News