: రహస్యాలన్నీ బయటపెడతామన్న బీజేపీ...మోస్ట్ వెల్ కమ్ అన్న సోనియా గాంధీ!

వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలోని రహస్యాలన్నిటినీ బయటపెడతామని బీజేపీ వర్గాలు పేర్కొనగా, దానిని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ స్వాగతించారు. అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంపై చర్చతో పార్లమెంటు దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చను ప్రారంభిస్తూ బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగేందుకు వీలుగా యూపీఏ ప్రభుత్వం దొడ్డిదారిన అనుమతులు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ స్కాంలో దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన కాంగ్రెస్ ను నిలదీశారు. దీనిపై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ తీవ్రంగా స్పందించారు. ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది యూపీఏ ప్రభుత్వం అన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం దీనిపై బీజేపీ వర్గాలు స్పందిస్తూ...వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అన్ని విషయాలు రక్షణ మంత్రి రాజ్యసభ ముందుంచుతారని అన్నారు. దీనిపై సోనియా గాంధీ మాట్లాడుతూ, 'మోస్ట్ వెల్ కమ్' అన్నారు. ఈ విషయంలో అన్ని విషయాలను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

More Telugu News