: బ్రాండెక్స్ కార్మికులకు జగన్ సంఘీభావం!... నేడు విశాఖకు వైసీపీ అధినేత

కనీస వేతనాలు, పీఎఫ్ బకాయిల విడుదల కోసం రోజుల తరబడి ఉద్యమం చేస్తున్న బ్రాండెక్స్ కంపెనీ కార్మికులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు లభించింది. గత నెల 15 నుంచి విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండెక్స్ గేట్ల ముందు వేలాది మంది కార్మికులు విడతలవారీగా ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ ముందు తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత టీడీపీ సీనియర్ నేత, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగినా... శ్రీలంకకు చెందిన బ్రాండెక్స్ దారికి వచ్చినట్లే వచ్చి మొండికేసింది. దీంతో అక్కడ కార్మికుల ఉద్యమం కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు విశాఖ పర్యటనకు వెళ్లనున్న జగన్... నేరుగా బ్రాండెక్స్ కంపెనీ కార్మికుల వద్దకు వెళతారు. కార్మికుల దీక్షలకు మద్దతు తెలపనున్న జగన్... బ్రాండెక్స్ వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తూర్పారబట్టనున్నారు.

More Telugu News