: పంజాబ్ రెండో విజయం సాధించింది...సత్తాచాటిన బౌలర్లు

ఐపీఎల్ సీజన్ 9 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండో విజయం అందుకుంది. రాజ్ కోట్ వేదికగా జరిగిన 28వ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు సత్తాచాటారు. తొలుత ఓపెనర్లతో మిడిలార్డర్ లో ఇద్దరు బ్యాట్స్ మన్ అంచనాలు అందుకోవడంతో టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 154 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్ మన్ లో మురళీ విజయ్ (55), స్టోయిన్స్ (27) శుభారంభం ఇవ్వగా, కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (31), సాహా (33) ఆకట్టుకున్నారు. దీంతో 154 పరుగులకు పంజాబ్ అలౌట్ అయింది. అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ బ్యాట్స్ మన్ కు పంజాబ్ బౌలర్లు బంతితో నిప్పులు చెరిగి, తిరుగులేని లైన్ అండ్ లెంగ్త్ తో చుక్కలు చూపించారు. ఓపెనర్ మెక్ కల్లమ్ (1), ఆ తరువాత కెప్టెన్ రైనా (18) ను మోహిత్ శర్మ అద్భుతమైన బంతితో పెవిలియన్ కు పంపగా, వెంటనే మరో ఓపెనర్ స్మిత్ (15) ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. అదే ఊపులో దినేష్ కార్తిక్ (2), రవీంద్ర జడేజా (11), వెంటనే డ్వెన్ బ్రావో (0) ను కూడా అక్షర్ పెవిలియన్ కు పంపాడు. దీంతో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం ఇషాన్ కిషన్ (27), జేమ్స్ ఫాల్కనర్ (32) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో అలరించారు. ఇషాన్ కిషన్ రన్ అవుట్ కాగా, ఫాల్కనర్ భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. అనంతరం ప్రవీణ్ కుమార్ (15) ఆకట్టుకున్నాడు. చివర్లో ధావల్ కులకర్ణి (9) షాట్లు ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో నాలుగు వికెట్లతో అక్షర్ పటేల్ రాణించగా, మూడు వికెట్లు తీసి మోహిత్ శర్మ సత్తచాటాడు. ఒక వికెట్ తీసి సందీప్ శర్మ ఆకట్టుకున్నాడు. దీంతో పంజాబ్ టోర్నీలో రెండో విజయం సాధించింది.

More Telugu News