: చాన్నాళ్ల తరువాత వరుస లాభాల బాట!

ఇటీవలి కాలంలో పడుతూ లేస్తూ సాగుతున్న భారత స్టాక్ మార్కెట్ బుధవారం నాటి లాభాలను కొనసాగించింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 100 పాయింట్లకు పైగా నమోదైన లాభం ఆపై మరింతగా పెరిగింది. మధ్యాహ్నం తరువాత కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించినా, అదే సమయంలో ట్రేడర్లు షార్ట్ సెల్లింగ్ కు దిగడం మార్కెట్ కు లాభించింది. దీంతో గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 267.35 పాయింట్లు పెరిగి 1.14 శాతం లాభంతో 23,649.22 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 83.80 పాయింట్లు పెరిగి 1.17 శాతం లాభంతో 7,191.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.63 శాతం, స్మాల్ క్యాప్ 0.59 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 33 కంపెనీలు లాభాల్లో నడిచాయి. డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, కెయిర్న్ ఇండియా, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్ తదితర కంపెనీలు లాభపడగా, మారుతి సుజుకి, ఆసియన్ పెయింట్స్, బీహెచ్ఈఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,682 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,418 కంపెనీలు లాభాల్లోను, 1,114 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బుధవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 87,57,497 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ నేడు రూ. 88,39,016 కోట్లకు పెరిగింది.

More Telugu News