: హైదరాబాద్ ను మూడు దశల్లో అభివృద్ధి చేద్దాం: మంత్రి కేటీఆర్
మున్సిపల్ శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధిపై అధికారులకు సూచనలు చేశారు. తొలిరోజే జీహెచ్ఎంసీ అధికారులు, పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, నగరాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకోసం అధికారులు వంద రోజులు, మూడేళ్లు, ఐదేళ్లు లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. నగరాన్ని సరైన గాడిలో పెట్టాలంటే అధికార వికేంద్రీకరణ తప్పక జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నగరంలో చాలా చోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ సరిగా వసూలు కావడంలేదని, దానిపై ప్రధానంగా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. ఎన్నికల ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పారు.